‘పెళ్లి చూపులు’ ఫేమ్ తరుణ్ భాస్కర్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం ” ఈ నగరానికి ఏమైంది “. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ ని హీరో దగ్గుబాటి రానా విడుదల చేసిన విషయం తెలిసిందే. సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కొందరు స్నేహితులు లఘు చిత్రాన్ని షూట్ చేయడానికి గోవా వెళ్తారు, ఆ తరువాత అక్కడ జరిగిన కొన్ని అనుకోని సంఘటనల గురించి తెలియచేసేదే ఈ సినిమా కథ. విశ్వక్సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమతం, వెంకటేశ్ కాకుమాను, అనీశా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. వివేక్ సాగర్ స్వరాలూ సమకూరుస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 29 వ తేదీన విడుదల కాబోతుంది.
అయితే ఈ రోజున చిత్ర బృందం వారు రావి నారాయణ్ రెడ్డి ఆడిటోరియంలో ” ఈ నగరానికి ఏమైంది ” ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటీఆర్, మరియు యువ కథానాయకులు రానా దగ్గుబాటి, నాగచైతన్య, విజయ్ దేవరకొండ రానున్నారని సమాచారం.