ఈ ఏడాది ‘NGK’ సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన సూర్య…ఇపుడు కే.వి.ఆనంద్ దర్శకత్వంలో ‘కాప్పన్’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రముఖ మళయాళ సూపర్స్టార్ మోహన్ లాల్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో ‘బందోబస్త్’ టైటిల్తో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం ఈ సినిమా అటు తమిళ్తో పాటు ఇటు తెలుగులో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ సినిమా ట్రైలర్లును బట్టి చూస్తే బందోబస్త్ దేశ భద్రత, ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కించనట్టు కనబడుతోంది.ఈ సినిమాలో మోహన్లాల్.. ప్రధాన మంత్రి పాత్రలో నటించారు. సూర్య NSG కమెండో పాత్రలో నటించాడు. ఇతర ముఖ్యపాత్రల్లో ఆర్య, బొమన్ ఇరానీ, సాయేషా సైగల్ నటించారు. ఇక నిజ జీవితంలో దంపతులు అయిన ఆర్య, సయేషా సైగల్ ఈ సినిమాలో కనిపించడం హైలెట్.
సయేషా హీరోయిన్గా నటిస్తే… ఆర్య మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. కొద్ది కాలంగా తన రేంజ్కు తగిన హిట్లు లేక విలవిల్లాడుతోన్న సూర్య ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. రంగం సినిమాతో తమిళ్తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న కెవి.ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గతంలో సూర్యతో ఆనంద్ బ్రదర్స్, వీడొక్కడు సినిమాలు తెరకెక్కించారు.
ఇక హరీస్ జయరాజ్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున తెరకెక్కించింది. సినిమాపై ట్రైలర్ రిలీజ్ అయ్యాక మంచి అంచనాలే ఉన్నాయి. మరి బందోబస్త్ సూర్య తలరాత మారుస్తుందో ? లేదో ? చూడాలి.