1935 డిసెంబర్ 6న గుంటూరు జిల్లా చిర్రావూరు లో సుభద్రమ్మ, గురవయ్య దంపతులకు జన్మించిన మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సావిత్రి పుట్టిన ఆరు నెలలకే తండ్రి చనిపోవడంతో పెద్దమ్మ దుర్గమ్మ, పెదనాన్న వెంకటరామయ్య వద్ద విజయవాడలో పెరిగింది. చిన్నప్పటినుంచి నటన , నాట్యం మీద ఆసక్తి ఉండడంతో ఎనిమిదవ తరగతి వరకే చదువుకున్న ఈమె పలు నాటకాలు వేసేది. అంతేకాదు తనకు నాట్యం వచ్చు అని అందరికీ తెలియజేయడానికి నాట్య ప్రదర్శనలో.. 1948లో వచ్చిన బాలరాజు చిత్రంలో అంజలీదేవి “తీయని వెన్నెల రేయి ” అనే పాటకు ప్రత్యేకంగా సావిత్రి అభినయించి.. అందరి మెప్పు పొందుతూ వుండేది.
అలా ఎన్నో విజయాలు సొంతం చేసుకున్న సావిత్రి సినిమాలలో అవకాశాలు దక్కించుకొని.. మరి ఎంతో ఉత్తమంగా సినీ ఇండస్ట్రీలో ఎదిగింది. ఎన్టీఆర్ , ఏఎన్నార్ , ఎస్వీఆర్ వంటి వారే మహానటి సావిత్రితో నటించాలి అంటే డైలాగులను ఒకటికి రెండుసార్లు చదివేవారు. అంతలా సావిత్రితో నటించాలి అంటే ప్రతి ఒక్కరూ భయపడేవారు అని చెప్పవచ్చు . దీన్ని బట్టి చూస్తే ఆమె ఎంత గొప్ప నటీమణి మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈమె నటించిన చిత్రాలలో దేవదాసు సినిమా ద్వారా ఈమెకు మహానటి అనే గుర్తింపు కూడా లభించింది.ఇకపోతే సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును కోటాను కోట్లు గా కూడబెట్టిన ఈమె.. ఇతరులకు సహాయం చేయడంలో కూడా ఎప్పుడూ ముందుండేది. కానీ ఈమె అమాయకత్వాన్ని ఈమెకు లెక్కలు రావనే విషయాన్ని తెలుసుకొని.. ఆమె ఆస్తులను ఆమె భర్త జెమినీ గణేషన్ జుర్రుకోవడం మొదలుపెట్టాడు.
అయితే ఒకవైపు ఆస్తులు తరుగుతున్న సమయంలోనే సినిమాలకు నిర్మాణ బాధ్యతలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది సావిత్రి. అలా 1968లో అందరూ మహిళలే కలిసి ఒక సినిమా తీయాలని ప్లాన్ చేసినప్పుడు.. ఆ సినిమాను డైరెక్ట్ చేయవలసిందిగా సావిత్రిని కోరారు. చివరికి సినిమా బాధ్యత అంతా ఆమె నెత్తి మీద పడేసరికి.. నష్టం రావడంతో ఆమెకు మొట్టమొదటి జరిగిన ఎదురుదెబ్బ ఇదే అని చెప్పవచ్చు. ఆ సినిమానే చిన్నారి పాపలు.. ఈ చిత్రంలో షావుకారు జానకి, జమున, జగ్గయ్య తదితరులు నటించారు. అయితే ఈ సినిమా నిర్మాతలు మధ్యలోనే డ్రాప్ అవ్వడంతో ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా ఈమె చేపట్టింది. కానీ ఈ సినిమాపై భారీ స్థాయిలో ఖర్చుపెట్టినా.. ఈ సినిమా మాత్రం పూర్తి స్థాయిలో డిజాస్టర్ అవడంతో ఇక్కడే ఈమె పతనానికి తొలిమెట్టు పడిందని చెప్పవచ్చు. అలా తర్వాత క్రమక్రమంగా ఆస్తులను కోల్పోయి చివరకు ఏమీ లేని అనాధగా మరణించింది సావిత్రి.