బాలీవుడ్ ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ శతృఘ్నసిన్హా గారాలపట్టి సోనాక్షి సిన్హాపై యూపీ పోలీసులు చీటింగ్ కేసు పెట్టడం సంచలనంగా మారింది. గతేడాది ఓ స్టేజీ ప్రదర్శన ఇచ్చేందుకు ఆమె రూ.24 లక్షలు తీసుకుని ఆ కార్యక్రమానికి వెళ్లలేదన్న నేపథ్యంలో ఈ కేసు నమోదు చేసారు. సోనాక్షిపై ఐపీసీ సెక్షన్ 420, 406 ల కింద కేసు నమోదు చేశారు. ఛీటింగ్ కేసు విషయంలో దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్ నుంచి ఓ పోలీసు బృందం గురువారం సాయంత్రం ముంబైలోని సోనాక్షిసిన్హా ఇంటికి వచ్చింది. పోలీసులు వచ్చినపుడు సోనాక్షిసిన్హా ఇంట్లో అందుబాటులో లేదు అని సమాచారం.
బీజేపీ మాజీ ఎంపీ అయిన సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా గత లోక్సభ ఎన్నికల సమయంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బిహార్ రాజధాని పాట్నా నుంచి ఆయన గత రెండు ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి పోటీ చేశారు. అయితే మంత్రి పదవి ఇవ్వలేదన్న కోపంతో పాటు బీజేపీ అధిష్టానంపై ఆయన అనేక ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో మోడీ ఆయనకు టిక్కెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
మరోవైపు సోనాక్షి తల్లి సమాజ్వాదీ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆమె యూపీ నుంచి లోక్సభకు పోటీ చేసి బీజేపీ ఈప్రభంజనంలో కొట్టుకుపోయారు. గత ఎన్నికల్లో తల్లి తరపున ఎన్నికల ప్రచారం చేసిన సోనాక్షిసిన్హాపై యూపీ పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది జరిగిన ఇష్యూకు సంబంధించి ఇప్పుడు కేసు ఎందుకు నమోదు అయ్యింది ? అన్నదానిపై కూడా చర్చలు నడుస్తున్నాయి. ఇందులో రాజకీయ కోణం ఉందన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.