విశాఖ నగరంలోని పరవాడ ఫార్మాసిటీలో సోమవారం ఉదయం గ్యాస్ లీకేజీ అవ్వడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. అకస్మాత్తుగా వ్యర్థ జలాల పంప్ హౌస్లో గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. పాయకరావుపేటకు చెందిన మణికంఠ (25), దుర్గాప్రసాద్ (25) బాధితులు అని.. పోలీసులు గుర్తించారు. ఈ గ్యాస్ లీకేజీ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
విశాఖలో గ్యాస్ లీక్ ఘటనలు తరచూ చోటు చేసుకొంటుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం మే నెలలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటన తీవ్ర విషాదాన్నే నింపింది. ఈ ఘటనలో దాదాపు 10 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. అదేవిధంగా వందలాది మంది తీవ్ర అస్వస్థతకు కూడా గురయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలో సైతం గ్యాస్ లీకైనది. దీంతో వందల సంఖ్యలో కార్మికులు ప్రాణభయంతో ఒక్కసారిగా పరుగులు తీసారు. అధికారులు వెంటనే అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదమే తప్పినది. తాజాగా ఫార్మాసిటీలో చోటుచేసుకున్న ఘటన విశాఖపట్టణం వాసులను మరొకమారు ఆందోళనకు గురిచేసింది.