టాలీవుడ్లో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు రావడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ సంక్రాంతి సీజన్లో ఒకే రోజు పెద్ద హీరోల సినిమాలు అంటే ఏ సినిమా తేడా కొట్టినా చాలా మంది కుదేలైపోతారు. ఇక వచ్చే సంక్రాంతికి టాలీవుడ్లో ఏకంగా ఇద్దరు పెద్ద హీరోలు అయిన మహేష్బాబు, అల్లు అర్జున్ నటిస్తోన్న సినిమాలు బాక్సాఫీస్ రేసులో ఉన్నాయి.
వీరిలో బన్నీ నటిస్తోన్న అల వైకుంఠపురంలో, మహేష్బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు రెండు సినిమాలు జనవరి 12న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు స్టార్ హీరోలే.. వీరిద్దరు ఇగోలకు, పంతాలకు పోవడంతో చివరకు ఒకే డేట్ ఫిక్స్ చేసుకోక తప్పలేదు. ముందుగా ఈ రెండు సినిమాలను రెండు లేదా మూడు రోజుల గ్యాప్లో విడుదల చేయించేందుకు ప్రయత్నాలు జరిగాయి.
ముందుగా బన్నీ అల వైకుంఠపురంలో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడం.. ఆ వెంటనే గంటకే మహేష్ సరిలేరు నీకెవ్వరు డేట్ కూడా ఎనౌన్స్ చేయడంతో బాక్సాఫీస్ యుద్ధం మంచి రసవత్తరంగా మారింది. ఈ పోటీ నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అదే టైంలో ఈ రెండు సినిమాల బయ్యర్లతో పాటు సినిమా కొన్న వారు కూడా ఓపెనింగ్స్ రాక నష్టపోవడం ఖాయం. ఏ సినిమాకు అయినా టాక్ తేడా వస్తే మటాష్ అయిపోతారు. ఇక ఈ పోటీ నివారించడానికి ఇద్దరు హీరోలతో మీటింగ్ పెట్టి సయోధ్య కుదిర్చేందుకు టాలీవుడ్ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇవి ఎంత వరకు ఫలిస్తాయో ? చూడాలి.