మూడు టీ 20 మ్యాచ్ల సీరిస్లో భాగంగా ఢిల్లీలో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. ముష్ఫికర్ రహీమ్ అద్భుత ప్రదర్శనతో బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ సిరీస్ తొలి టీ20లో భారత జట్టుపై సులభంగా విజయం సాధించింది. ఇప్పటి వరకు ఈ రెండు దేశాల మధ్య 8 టీ 20 మ్యాచ్లు జరగగా భారత్ ఓడిపోవడం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్లో భారత జట్టును ఓడించడం ఇదే మొదటిసారి.
ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత బౌలర్ల చెత్త ప్రదర్శనతోనే భారత్ ఓడిపోయింది. ఇక అటు బ్యాటింగ్లోనూ ఇండియా ఆటగాళ్లు తేలిపోయారు. పసలేన బ్యాటింగ్, బౌలింగ్తో భారత్ చేజేతులా ఓడిపోయింది. భారత్ టీంలో శిఖర్ ధవన్ అత్యధికంగా 41 పరుగులు చేశాడు. కానీ విరాట్ కోహ్లీ గైర్హాజరుతో మిడిల్ ఆర్డర్లో వచ్చిన బ్యాట్స్మెన్లు ఎవరూ నిలదొక్కుకోలేకపోయాడు.
ఆ శిఖర్ ధావన్ కూడా చాలా బంతులు వేస్ట్ చేసేశాడు. మ్యాచ్ హీరోగా నిలిచిన బంగ్లాదేశ్ వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ ముష్ఫికర్ రహీమ్ 43 బంతుల్లో 60 పరుగులు చేసి ఒంటి చేత్తో బంగ్లాకు విజయం అందించాడు. భారత్ ఓటమితో సోషల్ మీడియాలో పలువురు రోహిత్శర్మతో పాటు టీంపై సెటైర్లు పేల్చుతున్నారు. కొందరు పర్యావరణ వాది రోహిత్ గెలిచాడని ఎద్దేవా చేస్తే… మరికొందరు మాత్రం బౌలర్ ఖలీల్ అహ్మద్ను ఆటాడుకున్నారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత భారత్ ట్విటర్లో #IndvsBan మొదటి స్థానంలో, #Khaleel రెండో స్థానంలో ట్రెండ్ అయ్యాయి. ఓ అభిమాని అయితే ఏ ఉపాధి పథకం తరఫున ఖలీల్కు జట్టులో చోటు లభించింది. ఆయన దగ్గర సెలక్టర్ల రహస్యాలు ఏమైనా ఉన్నాయా ? అని విమర్శించాడు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ఖలీల్, కృణాల్ పాండ్యా లాంటి వాళ్లను నమ్ముకుంటే టీం ఇండియా నిండా మునుగుతుందని కొందరు చెప్పారు. మరికొందరు మాత్రం మ్యాచ్ గెలిస్తే దీపావళికి మిగిలిన టపాసులు కాలుస్తారనే రోహిత్ కావాలని మ్యాచ్ ఓడిపోయాడని ఎద్దేవా చేస్తూ పరోక్షంగా ఢిల్లీ కాలుష్యానికి లింక్ పెట్టి మరీ కౌంటర్ ఇచ్చారు.